Government projects | న్యూఢిల్లీ: భారత్ను విశ్వగురువుగా నిలబెడుతున్నామని ఊదరగొడుతున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, వాస్తవంలో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అనుకొన్న సమయంలో పూర్తిచేయటంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ నెల నివేదికలో ప్రకటించింది. మోదీ సర్కారు చేపట్టిన రూ.250 కోట్లకు మించి విలువైన ప్రాజెక్టుల్లో ఏకంగా 56.2 శాతం ప్రాజెక్టుల్లో ఆలస్యంగా పనులు కొనసాగుతున్నట్టు కుండబద్దలు కొట్టింది. గత 20 ఏండ్లలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం, ఆలస్యం ఎన్నడూ చోటుచేసుకోలేదని తేల్చిచెప్పింది. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఏకంగా 717 ప్రాజెక్టులు నత్తతో పోటీపడి నడుస్తున్నాయని రిపోర్టు స్పష్టంచేసింది.
పనులు ఎక్కడివక్కడే ఆగిపోవటంతో వాటి అంచనా వ్యయం అమాంతం పెరిగిపోయి తడిసి మోపెడవుతున్నది. మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించినప్పుడు మొత్తం అంచనా వ్యయం రూ.3.97 లక్షల కోట్లు. ప్రస్తుతం అది రూ.4.60 లక్షల కోట్లకు పెరిగిందని నివేదికలో తెలిపారు. రైల్వేశాఖ చేపట్టిన 173 ప్రాజెక్టుల్లో ఏకంగా 114 ప్రాజెక్టుల పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. దీంతో వీటి అంచనా వ్యయం ఏకంగా 68.1 శాతం పెరగటం గమనార్హం. పెట్రోలియం శాఖ ప్రాజెక్టుల్లో 86 పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి.