న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఉద్యోగాల భర్తీలో కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్లక్ష్యం, నిరుద్యోగులకు చేస్తున్న మోసం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతున్నది. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్కు కేంద్రం ఇచ్చిన సమాధానాల్లో పలు విభాగాల్లో లక్షలాది సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారికంగా తేలగా.. పారామిలిటరీ బలగాల్లో 84 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం తాజాగా తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ మంగళవారం లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్తో సహా ఆరు పారామిలిటరీ దళాల్లో 84,600 ఖాళీలున్నాయని తెలిపారు. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సూచనల మేరకు పారామిలిటరీ బలగాల్లో 10 శాతం ఖాళీలను అసిస్టెంట్ కమాండ్ స్థాయి వరకు ఎక్స్ సర్వీస్మెన్లకు రిజర్వ్ చేసినట్టు వెల్లడించారు. వీటిని డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.