న్యూఢిల్లీ : మన దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ చేస్తారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. మేలుకుని ఉన్నపుడు 31 శాతం సమయాన్ని స్మార్ట్ఫోన్లతోనే గడుపుతారని, రోజుకు సగటున 80 సార్లు తమ ఫోన్లను చెక్ చేస్తారని తెలిపింది. కంటెంట్ను స్ట్రీమింగ్ చేయడానికి దాదాపు 50 శాతం సమయాన్ని వెచ్చిస్తారని చెప్పింది. స్మార్ట్ఫోన్లతో గడిపే సమయం 2010లో దాదాపు రోజుకు రెండు గంటలు ఉండేదని, ఇప్పుడు ఇది 4.9 గంటలకు పెరిగిందని తెలిపింది.
2010లో యూజర్లు టెక్స్, కాల్స్ ద్వారా సాంఘిక సంబంధాల కోసం నూటికి నూరు శాతం సమయాన్ని వెచ్చించేవారని, 2023లో ఇది కేవలం 20-25 శాతానికి తగ్గిందని వివరించింది. ఇప్పుడు సెర్చింగ్, గేమింగ్, షాపింగ్, ఆన్లైన్ లావాదేవీలు, వార్తల కోసం ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్నారని చెప్పింది. 18-24 సంవత్సరాల మధ్య వయస్కులు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి షార్ట్ ఫార్మ్ వీడియోస్పై ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపింది. ఫోన్ను పట్టుకున్న ప్రతి రెండుసార్లలో ఒకసారి కేవలం అలవాటుగా మాత్రమే పట్టుకుంటున్నారని, అవసరం ఉండటం వల్ల కాదని వెల్లడించింది. జన జీవితంలో తాళాలు, వ్యాలెట్ల కన్నా ఎక్కువ ముఖ్యమైనదిగా స్మార్ట్ఫోన్ మారిందని తెలిపింది.