షిమ్లా: హిమాచల్ప్రదేశ్ ప్రజలు ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఓట్ల పండుగ చేసుకున్నారు. ఓటర్లు పోటీపడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య పండుగలా అనిపించింది. యువత మాత్రమే కాదు, వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు. పైగా ఎన్నికల సంఘం సైతం పోలింగ్ స్టేషన్లకు రాలేని స్థితిలో ఉన్న 80 ఏండ్ల పైబడిన వృద్ధులకు.. వారి ఇండ్ల దగ్గరే బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
కాగా, ఇవాళ్టి ఓట్ల పండుగలో డోల్మా అనే 83 ఏండ్ల వృద్ధురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాంబా జిల్లా పంగి ఏరియా చసాక్ భటోరిలోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు ఉన్న ఆ వృద్ధురాలు అక్కడికి చేరేందుకు చాలా రిస్క్ చేసింది. మంచుతో నిండిపోయి ఉన్న రోడ్డుపై ఏకంగా 14 కిలోమీటర్ల దూరం నడిచిపోయి మరీ తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు వేసేందుకు బద్దకించే ఎంతో మంది యువతకు ఈ బామ్మ మంచి ఆదర్శమని అధికారులు తెలిపారు.
డోల్మాతోపాటే ఇంకా పలువురు వృద్ధులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 103 ఏండ్ల వృద్ధుడు ప్యార్సింగ్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశాడు. 90 ఏండ్ల వృద్ధురాలు నర్జమ్ మనీ, తన 87 ఏండ్ల భర్త భీషమ్ దాస్తో కలిసి కిన్నౌర్లో ఓటు హక్కును వినియోగించుకుంది. సోలన్ నియోజకవర్గంలో 105 ఏండ్ల దలియా రామ్ ఓటు వేశాడు. చురా అసెంబ్లీ స్థానంలో 105 ఏండ్ల నారోదేవి ఓటు హక్కును వినియోగించుకుంది.