అయోధ్య: అయోధ్య రామాలయ(Ayodhya Ram Temple) నిధులను దుర్వినియోగం చేసినట్లు నమోదు అయిన కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో యూపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ కూడా దర్యాప్తు చేపట్టింది. అయితే ఎఫ్ఐఆర్లో ఉన్న 8 మందిని గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు ఇవాళ అధికారులు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
అవనాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాస్ శ్రీవాత్సవ్, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను ఆ జాబితాలో ఉన్నారు. రామాలయానికి విరాళాల రూపంలో అందే నగదు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో ఆ 8 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందరూ అయోధ్యలోనే ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు.
భారతీయ న్యాయ సంహితలోని 306(ప్రాపర్టీ చోరీ) 316(విశ్వాస ఘాతుకం), 317(ఎత్తుకెళ్లిన చోరీని దాచిపెట్టడం), 61(నేరపూరిత కుట్ర) లాంటి సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర సూచన మేరకు యూపీ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసింది. 23వ తేదీన ఆ కమిటీ తన రిపోర్టును అందజేసింది. ఇక జూన్ 25వ తేదీన సిట్ ప్రతిపాదనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు 7.5 కోట్లు అదృశ్యమైనట్లు గుర్తించారు.