లక్నో: 82 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పెంపుడు కుక్క కొరికి చంపిన సంఘటన గుర్తుందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోనగరం కైసర్బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన పిట్బుల్ కుక్క ఆమెపై దాడి చేసింది. ఆమె శరీరంపై మాంసాన్ని పండ్లతో పీకింది. మెడ నుంచి పొట్ట భాగం వరకు 12 గాయాలయ్యాయి. చివరికి ఆమె మృతిచెందింది. ఈ భయంకరమైన కేసు కుక్కల యజమానులను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా పిట్బుల్ కుక్కలు పెంచుకుంటున్న యజమానులు.. ఈ ఘటన తర్వాత వాటిని వదులుకున్నారు.
ఇదిలా ఉండగా, లక్నోలో యజమానిని పొట్టనపెట్టుకున్న పిట్బుల్ కుక్కను దత్తత తీసుకునేందుకు ఎనిమిది ఎన్జీవో సంస్థలు ముందుకొచ్చాయి. ఆ కుక్క ప్రస్తుతం లక్నో మునిసిపల్ కార్పొరేషన్ (ఎల్ఎంసీ) అధికారులు, వెటర్నరీ నిపుణుల పర్యవేక్షణలో జంతు సంరక్షణ కేంద్రంలో ఉంది. కిల్లర్ పిట్బుల్ క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని జంతు సంరక్షణ అధికారి డాక్టర్ అభినవ్ వర్మ తెలిపారు. రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకుంటున్నదని చెప్పారు.
‘ఈ నెల 27 వరకు పిట్బుల్ను షెల్టర్లో ఉంచుతాం. ఆ తర్వాత దాన్ని ఎక్కడికి పంపించాలనేది నిర్ణయిస్తాం. మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ అధికారులకు ఫోన్చేసి.. దాన్ని యజమాని అమిత్ త్రిపాఠికి అప్పగించాలని కోరారు. అయితే, తమనకు అమిత్ ఇప్పటివరకూ సంప్రదించలేదు’ అని అభినవ్ వర్మ పేర్కొన్నారు. యాజమాని కుక్కను తీసుకెళ్లేందుకు రాకుంటే దాన్ని ఎన్జీవోలకు అప్పగిస్తామని తెలిపారు.