ముంబై: మహారాష్ట్రలో మరో 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒక్క పూణేలోనే ఆరుగురికి కొత్త వేరియంట్ సోకగా, ముంబైలో ఒకరు, కళ్యాణ్లో మరోకరు దీని బారినపడ్డారు. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శుక్రవారం ఇచ్చిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో మరో 8 మంది రోగులకు ఓమిక్రాన్ సోకినట్లు తేలింది. వీరిలో 6 మంది రోగులు పూణేకు, ఒక రోగి ముంబై, మరో రోగి కళ్యాణ్ డోంబివల్కు చెందిన వారు’ అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఎనిమిది మంది టీకాలు తీసుకున్నారని, వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని పేర్కొంది.
కాగా, పాజిటివ్ వచ్చిన తర్వాత 8 మందిలో ఇద్దరు రోగులు మాత్రమే ఆసుపత్రిలో చేరారని, మిలిగిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కు చేరినట్లు చెప్పారు. ఇందులో 25 మంది రోగులకు నెగిటివ్గా రిపోర్ట్ రావడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు.