Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మరో 8 మంది మావోయిస్టులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో దంతెవాడ జిల్లాలోని అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీసులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటి వరకు మొత్తం 17 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం అర్నాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, వీరిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారందరిని రిమాండ్కు తరలించారు. మైనర్ను జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 26వ తేదీన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు పోలీసులతో వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసిన సంగతి తెలిసిందే. దీంతో 10 మంది పోలీసులు, డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మొదట ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిచంగా, ఎవరెవరి పాత్ర ఉందన్న విషయాలు బయటపడ్డాయి. అనంతరం మిగతా వారిని అరెస్టు చేశారు.