ఇంఫాల్: మణిపూర్లో జాతి ఘర్షణల వల్ల చెలరేగిన హింసాకాండలో (Manipur Violence) మరణించిన వారి మృతదేహాలను 8 నెలల తర్వాత మార్చురీల నుంచి బయటకు తీస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా పలు చోట్లకు తరలించి ఖననం చేస్తున్నారు. మైతీ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వాలని మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది ప్రతిపాదించింది. దీనిని వ్యతిరేకించిన కుకీ వర్గం ఈ ఏడాది మే 3న భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నాటి నుంచి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు, హింసాకాండలో 180 మందికిపైగా మరణించారు.
కాగా, మణిపూర్ హింసాకాండ బాధితులకు పరిహారం, పునరావాసం, మానవతా సహాయం కోసం ఏర్పాటైన కమిటీ ఒక నివేదిక రూపొందించింది. 175 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేదని, నెలలుగా పదుల సంఖ్యలో మార్చురీలో ఉన్నాయని పేర్కొంది. గుర్తించిన 169లో 81 మృతదేహాలు బంధువులు తీసుకెళ్లగా, 88 మృతదేహాలను ఇంకా ఎవరూ తీసుకెళ్లలేదని, ఇందులో ఆరింటిని ఎవరూ గుర్తించలేదని నివేదించింది. ఈ రిపోర్ట్పై సుప్రీంకోర్టు గత నెల స్పందించింది. జాతి హింసలో మరణించిన గుర్తుతెలియని మృతదేహాలను గౌరవప్రదంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఇంఫాల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీల్లో పలు నెలలుగా ఉన్న 64 మృతదేహాల తరలింపునకు మణిపూర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం భారీ భద్రత మధ్య సుమారు 19 మృతదేహాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా కాంగ్పోక్పీ జిల్లాకు తరలించారు. మరో 41 మృతదేహాలను చురచంద్పూర్ జిల్లాకు తరలించనున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన 9 చోట్ల ఈ మృతదేహాలను ఖననం చేయనున్నారు. అయితే మృతదేహాలను కుటుంబాలు స్వీకరించకుండా పౌర సంస్థలు అడ్డుకోవడంతో ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించలేదని మణిపూర్ ప్రభుత్వం ఆరోపించింది.