లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చేలరేగిన హింసలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మరణించిన వారిలో నలుగురు రైతులున్నారు. లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని మిశ్రా కుమారుడు ఉన్న వాహనం రైతులపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు రైతులు మరణించారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు మూడు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో రైతుల మీదకు దూసుకెళ్లిన వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయినట్లు లఖింపూర్ ఖేరి ఏఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.
కాగా, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం నుంచి జరిపిన కాల్పుల్లో ఒక రైతు చనిపోగా, వాహనం దూసుకెళ్లడంతో మరో ముగ్గురు మరణించినట్లు, మరో ఎనిమిది మంది గాయపడినట్లు కిసాన్ సంయుక్త మోర్చా ఆరోపించింది. ఈ ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు రైతు సంఘాలన్నీ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. రైతు నేత రాకేశ్ తికాయిత్తోపాటు పంజాబ్, హర్యానాకు చెందిన రైతు నేతలు యూపీకి చేరుకుంటున్నారు.
మరోవైపు ఈ ఘటనను రైతుల హత్యగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం లఖింపూర్ ఖేరిని సందర్శించి బాధిత రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.