Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోరం జరిగింది. భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. కథువా జిల్లాలో అబ్దుల్ ఖుయ్యుం, ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తులిద్దరూ వేర్వేరు నివాసాల్లో ఉంటున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వారి ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద ఉన్న మహిళలు, చిన్నారులను పోలీసులు వెలికితీశారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, వారిలో ఒకరు బాలుడు ఉన్నాడు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా శ్రీనగర్ – జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. పలు బ్రిడ్జిలు, కల్వర్ట్లు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. జమ్మూకు సమీపంలోని కత్రా వద్ద గడిచిన 24 గంటల్లో 315 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. తావి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.