హైదరాబాద్: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని తుముకురు జిల్లా పావగడ (Pavagada) పలవలహళ్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు (Private bus) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పావగడలోని దవాఖానకు తరలించారు.
కాగా, ఎస్వీటీ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు వైఎస్ హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని వెల్లడించారు. అయితే బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.