Pak Nationals | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ పౌరులు (Pak Nationals) దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది పాక్ పౌరులు భారత్ను వీడినట్లు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 24-29 మధ్య పంజాబ్లోని అటారీ- వాఘా సరిహద్దు (Attari Wagah Border) గుండా 786 మంది పాకిస్థానీయులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో పాక్ నుంచి 1,376 మంది భారతీయులు అదే సరిహద్దు గుండా దేశంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పాక్ పౌరులు తమ కుటుంబాలను వదిలి స్వదేశానికి తిరిగి వెళ్తుండడంతో సరిహద్దుల వల్ల ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. సార్క్ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 26, మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 డెడ్లైన్గా విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని స్వదేశాలకు పంపాలంటూ కేంద్ర ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్లో మాట్లాడారు.
కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా నివాసం ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించింది. వారిని వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి, ప్రభుత్వం విధించిన డెడ్లైన్ లోగా భారత్ విడిచి వెళ్లని పాకిస్థానీయులను అధికారులు అరెస్ట్ చేస్తారు. వారికి మూడేండ్ల జైలు శిక్ష, లేదా 3 లక్షల జరిమానా లేక రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంది.
Also Read..
PM Modi | మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
PM Modi | సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన