Graduation | న్యూఢిల్లీ, ఆగస్టు 9: తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించటంలో ఆడ, మగ అన్న బేధం తల్లిదండ్రులు చూపటం లేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. తమ అమ్మాయి కనీసం డిగ్రీ లేదా ఆపై ఉన్నత చదువులు పూర్తిచేసుకోవాలని గ్రామీణ భారత్లోని 78 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారని ‘స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా-2023’ నివేదిక పేర్కొన్నది.
ఈ నివేదిక ప్రకారం, ప్రతి నలుగురు అబ్బాయిల్లో ఒక్కరు ప్రాథమిక విద్యను మధ్యలో వదిలేస్తున్నారు. ఇది బాలికల్లో 35శాతంగా నమోదైంది. అబ్బాయిల్లో 75శాతం మంది, బాలికల్లో 65 శాతం మంది హైస్కూల్ విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని పరిశోధనలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో హైస్కూల్ విద్య అందుబాటులో లేకపోవటమే డ్రాపౌట్స్ భారీగా ఉండటానికి కారణమని నివేదిక విశ్లేషించింది.