తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ఇతర వేరియంట్లతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. రోజూ వారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు చివరికి రెండు వేల దిగువకు చేరాయి. ఇప్పుడు థర్డ్వేవ్ పుణ్యమా అని మళ్లీ పెరుగుతూ 10 వేలకు చేరువయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 9 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే ఒమిక్రాన్ వేరియంట్ కూడా మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేరళలో వేగంగా విస్తరిస్తున్నది. రోజూ పదుల సంఖ్యలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్కరోజే కొత్తగా 76 మందిలో ఒమిక్రాన్ బయటపడింది. దాంతో కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 421కి చేరింది. కాగా, కరోనా విస్తృతి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇప్పటికే పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వీకెండ్ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నది. పాఠశాలలను మూసివేసి ఆన్లైన్ పద్ధతిలో పాఠాలు బోధించుకునేందుకు అనుమతించింది. రవాణా సాధనాల్లో 50 శాతం కెపాసిటీతో మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తున్నది.