Republic Day | న్యూఢిల్లీ, జనవరి 26: భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుకలు అసలైన భారతీయతను ఆవిష్కరించటంతోపాటు దేశ సైనిక, ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈసారి వేడుకలు మొత్తాన్ని మహిళా అధికారులే ముందుండి నడిపించటం విశేషం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలు భారత ప్రధాన లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పాయి. ‘వికసిత్ భారత్’, ‘భారత్-లోక్తంత్ కా మాత్రుక’ థీమ్తో వేడుకలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు నివాళులు అర్పించటంతో వేడుకలు మొదలయ్యాయి. సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకల అతిథి మెక్రాన్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా కర్తవ్యపథ్కు తోడ్కొని వచ్చారు. అక్కడ జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత త్రివిధ దళాల వందనాలు, భారత ఆయుధ సంపత్తి ప్రదర్శనతోపాటు 100 మంది భారతీయ మహిళా సంగీత కళాకారులు వివిధ రకాల శాస్త్రీయ సంగీత వాయిద్యాలతో అలరించారు. వివిధ రాష్ర్టాలు, కేంద్ర శాఖల శకటాలు అందరినీ ఆకర్షించాయి. గిరిజన ఉద్యమాల ఇతివృత్తంతో ఏర్పాటుచేసిన తెలంగాణ శకటం విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ వేడుకలకు త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర మంత్రివర్గంతోపాటు వివిధ దేశాల రాయబారులు, ప్రముఖలు, సామాన్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గణతంత్ర వేడుకల్లో తొలిసారి త్రివిధ దళాల కంటింజెంట్లకు మహిళలు నాయకత్వం వహించారు. కంటింజెంట్లన్నింటికీ ఆర్మీ మిలిటరీ పోలీస్కు చెందిన కెప్టెన్ సంధ్య నాయకత్వం వహించగా, మూడు విభాగాలను ప్రత్యేకంగా కెప్టెన్ శరణ్యరావ్, సబ్ లెఫ్టినెంట్ అన్షు యాదవ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రిష్టి రావ్ ముందుండి నడిపించారు. ఆర్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కంటింజెంట్కు మేజర్ శ్రిష్తి కుల్లర్ నాయకత్వం వహించారు. ఆర్మీ డెంటల్ కార్ప్స్కు అంబా సమంత్, ఇండియన్ నేవీకి సర్జన్ లెఫ్టినెంట్ కాంచన, ఎయిర్ఫోర్స్కు ఫ్లైట్ లెఫ్టినెంట్ దివ్యప్రియ నాయకత్వం వహించారు. సైన్యానికి చెందిన మద్రాస్ రెజిమెంట్, గ్రెనెడియర్ రెజిమెంట్, రాజ్పుత్ రైఫిల్స్, సిక్కు రెజిమెంట్, కుమావున్ రెజిమెంట్ ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. నేవీకి చెందిన 144 మంది మహిళ, పురుష అగ్నివీర్స్తో కూడిన కంటింజెంట్కు లెఫ్టినెంట్ ప్రజ్వల్ నాయకత్వం వహించారు.
భూమి నుంచి గగనతంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ అస్త్ర, తేలికపాటి యుద్ధ విమానం తేజస్, రాడార్ వ్యవస్థ ఉత్తమ్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ, శక్తి సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను ప్రదర్శించింది. టీ-90 బ్రహ్మ యుద్ధ ట్యాంకులు, కొండప్రాంతాల్లో కూడా పనిచేయగల వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి తదితర ఆయుధ సంపత్తిని చూసి ఆహుతులు పులకించారు. రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఫ్రాన్స్కు చెందిన 93 మంది సభ్యుల మార్చింగ్ కంటింజెంట్, 30 మంది సభ్యులతో కూడిన బ్యాండ్ కంటింజెంట్ వేడుకల్లో భాగస్వామ్యమయ్యాయి. వేడుకల ముగింపులో ఎయిర్ఫోర్స్కు చెందిన 46 విమానాలు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.
గణతంత్ర వేడుకల్లో తొలిసారి భారతీయ సంగీతం అలరించింది. ఆవాహన్ పేరుతో 100 మంది సంగీతకారిణులు వివిధ రకాల సంగీత పరికరాలతో ప్రదర్శన ఇచ్చారు.