Nagaland | కోవిడ్ విజృంభిస్తున్నా… నాగాలాండ్ వాసులు మాత్రం తమ పోరాట పంథా నుంచి వెనక్కి మళ్లడం లేదు. ఏఎఫ్ఎస్పీఏ (సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం) చట్టాన్ని వెంటనే రద్దు, ఆర్మీ కాల్పుల్లో 14 మంది సామాన్యులు చనిపోయిన ఉదంతాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఉదంతం జరిగిన చుట్టు పక్కల ప్రాంతాల్లో, ప్రధాన పట్టణాల్లో మాత్రమే నాగాలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రభుత్వం మిన్నకుండి పోవడంతో తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఏఎఫ్ఎస్పీఏ చట్టం, ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించిన ఉదంతాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయండి అంటూ రాసి వున్న ప్లకార్డులను చేతబూని, నిరసనకారులందరూ పాదయాత్రగా బయలుదేరారు. నాగాలాండ్ కమర్షియల్ హబ్గా పేరు గాంచిన దిమాపూర్ నుంచి రాష్ట్ర రాజధాని కోహిమా వరకూ ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో దారిపొడుగునా ఉన్న వివిధ ప్రాంతాల ప్రజలు కూడా ఈ పాదయాత్రకు తమ మద్దతు పలుకుతున్నారు. తాము ఈ పాదయాత్రను చాలా శాంతియుతంగానే నిర్వహిస్తున్నామని, అత్యంత ప్రజాస్వామ్య రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఏఎఫ్ఎస్పీఏ చట్టంపై ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో తెలియజేయడానికే ఈ పాదయాత్ర అని రుకేవేజో వెట్సాహ్ అనే నిరసన కారుడు స్పష్టం చేశాడు.
ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేసే అవకాశాన్ని పరిశీలించేందుకు కేంద్రం ఓ కమిటీని వేసిందని నాగాలాండ్ సీఎం నెఫియూ రియో కొన్ని రోజుల క్రిందట వెల్లడించారు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సెస్ కమిషనర్ వివేక్ జోషి అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూశ్ గోయల్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఇక నాగాలాండ్ సీఎస్, డీజీపీ, అస్సాం రైఫిల్స్ డీజీపీ సభ్యునిగా ఉంటారు. ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేసే సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ 45 రోజుల్లోగా నివేదిక తయారు చేసి, కేంద్రానికి సమర్పించనుంది.