ముంబై: మహారాష్ట్రలో వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా జిల్లాలోని సెల్సురా వద్ద ఓ కారు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో ఏడుగురు వైద్య విద్యార్థులు (Medical students) మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యావత్మాల్ నుంచి వార్ధా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులాంతా దత్తా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారని చెప్పారు.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెడికల్ స్టుడెంట్స్ ప్రయాణిస్తున్న కారు సెల్సురా వద్ద అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడిందని వెల్లడించారు. 40 మీటర్ల ఎత్తుపైనుంచి పడటంతో కారు పూర్తిగా ధ్వంసమయిందని, దీంతో అందులో ఉన్నవారంతా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మృతుల్లో బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్డేల్ కుమారుడు కూడా ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.