తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతున్నది. భారీ వర్షాలకు కొడచరియలు విరిగి పడటంతో ఏడుగురు మృతిచెందారు. శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు పట్టణాలు నదులను తలపిస్తున్నాయి. ప్రధానంగా కొట్టాయం, పథనంమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీనష్టం వాటిల్లింది. వీటితోపాటు ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
శనివారం సాయంత్రం ఇడుక్కి జిల్లాలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది.
కాగా, శబరిమల ఆలయం ఆదివారం ఉదయం తెరచుకున్నది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు స్వామి దర్శనానికి రాకుండా ఉండటమే మంచిదని ఆలయ బోర్డు సూచించింది. తూల మాసం పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచారు. ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు.
తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో పలుచోట్ల వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో తిరపరప్పు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.