న్యూఢిల్లీ : 2016 నుంచి దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా అదే సమయంలో 6000 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాలతో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు దాదాపు 106 దేశాలకు తరలివెళ్లారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభకు అందించిన డేటా వెల్లడించింది.
2016 నుంచి 2021 వరకూ 7,49,765 మంది భారతీయులు పౌరసత్వాన్ని త్యజించగా 2019లోనే అత్యధికంగా 1.44 లక్షల మంది, 2016లో 1.41 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని ఈ గణాంకాలు తెలిపాయి. వీరిలో ఎక్కువమంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు తరలివెళ్లారు. ఈ నాలుగు దేశాలకు వలస వెళ్లిన వారు 82 శాతం వరకూ ఉండటం గమనార్హం.
2017 నుంచి 2.56 లక్షల మంది భారతీయులు అమెరికా వెళ్లేందుకు భారత పౌరసత్వాన్ని వదులుకోగా 91,000 మంది కెనడాకు వెళ్లేందుకు పౌరసత్వాన్ని విడిచిపెట్టారు. ఇక 2017 నుంచి 2021 మధ్య 2174 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకుని చైనా వెళ్లారు. ఇక ఇదే సమయంలో 5891 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.