Rajya Sabha | న్యూఢిల్లీ, జనవరి 4: ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మన్సుఖ్ మాండవీయ తదితరుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్తో ముగుస్తుంది. అలాగే నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.
మొత్తం 68 రాజ్యసభ ఎంపీ ఖాళీలలో న్యూఢిల్లీలో ఇప్పటికే మూడు సీట్లకు ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఆప్ నేతలు సంజయ్ సింగ్, నరైన్ దాస్ గుప్తా, సుశీల్ కమార్ గుప్తాల పదవీ కాలం ముగియడంతో ఈ స్థానాలతో పాటు సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఈ నెలాఖరున ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి.లింగయ్య యాదవ్లు పదవీ విరమణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, వైఎస్ఆర్సీపీ ఎంపీ వేమిరెడ్డిల పదవీ కాలం ఈ ఏడాది ముగియనుంది. అలాగే ఏపీకి చెందిన, యూపీ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కూడా త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో అక్కడ ఏ పార్టీ నుంచి ఎంతమంది సభ్యులెన్నికవుతారన్నది ఆసక్తిగా మారింది.