అహ్మదాబాద్: బీజేపీ మాజీ మంత్రితో సహా 68 మంది నిందితులను గుజరాత్ అల్లర్ల కేసు (Gujarat Riots Case)లో నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు గురువారం తీర్పు ఇచ్చింది. 2002లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ప్రయాణించిన సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్ను గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో దుండగులు తగులబెట్టారు. ఈ సంఘటనలో 58 మంది ప్రయాణికులు మరణించారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా అహ్మదాబాద్లోని నరోదాగామ్లో మారణకాండ జరిగింది. రెచ్చిపోయిన కొందరు పలు ఇళ్లకు నిప్పుపెట్టడంతో పాటు 11 మంది ముస్లింలను దారుణంగా హత్య చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, బజరంగ్ దళ్ మాజీ నేత బాబు బజరంగి సహా 86 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
కాగా, నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మాయా కొద్నానీ ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2017లో ఆమె తరుఫున డిఫెన్స్ సాక్షిగా అమిత్ షా కోర్టుకు హాజరయ్యారు. ఇరవై ఏళ్లకుపైగా కొనసాగిన కేసు విచారణ కాలంలో 18 మంది నిందితులు మరణించారు. బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నానీతో సహా మిగతా 68 నిందితులను నిర్దోషులుగా అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టు పేర్కొంది. ఈ మేరకు గురువారం తుది తీర్పు ఇచ్చింది.