న్యూఢిల్లీ: ఇండియా జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఇంకా 40 కోట్ల మందికి ఈ వైరస్ ముప్పు పొంచి ఉన్నదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నాలుగో జాతీయ సెరో సర్వేను రిలీజ్ చేసింది. ఈ నాలుగో సర్వేలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పిల్లలను కూడా చేర్చింది. దేశంలో 6-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 50 శాతానికిపైగా ఈ కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.
అత్యధికంగా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్లలో 77.6 శాతం మందికి, ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వాళ్లలో 76.7 శాతం మందికి, 18-44 ఏళ్ల వయసు వాళ్లలో 66.7 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సెరో సర్వే తేల్చింది. ఈ సర్వేలో పిల్లలను రెండు గ్రూపులు విభజించారు. 6-9 ఏళ్లు, 10-17 ఏళ్లు. వీళ్లలో 6-9 గ్రూపులో 57.2 శాతం మందిలో, 10-17 వయసు వాళ్లలో 61.6 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి.