న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశంలోని కేంద్రియ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత వేధిస్తున్నది. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతున్నది. కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 6,549 అధ్యాపక పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీ వర్సిటీలోనే 900 ఖాళీలు ఉండగా, ఆ తర్వాత అలహాబాద్ యూనివర్సిటీలో 622 ఖాళీలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో నిధుల కొరత ఉండటం, అధ్యాపక పోస్టులకు సరైన అర్హతలు గల అభ్యర్థులు దొరక్కపోవడం, కొన్ని యూనివర్సిటీలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వంటి కారణాల వల్ల అధ్యాపక పోస్టుల భర్తీ జరగడం లేదు. 2021 సెప్టెంబర్ 5 నుంచి ఏడాది లోపు ఖాళీలను యుద్ధప్రాతిపాదికన భర్తీ చేయాలని అప్పట్లో కేంద్ర విద్యా శాఖ అన్ని కేంద్రియ యూనివర్సిటీలకు ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఇచ్చిన గడువు ముగిసినా పరిస్థితి మారలేదు. ఖాళీల భర్తీ జరగలేదు. ఇక, శాశ్వత అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో తాత్కాలిక ప్రాతిపాదికన నియమించిన వారితో ఎక్కువగా తరగతులు నడుస్తున్నాయి. అయితే, వీరిలోనూ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన ఉన్నది. ఏండ్లుగా పనిచేస్తున్నా ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని స్థితిలో వీరున్నారు. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ జరగాలంటే సరిపడా బడ్జెట్ను కేంద్రం కేటాయించాలని పలువురు ప్రొఫెసర్లు కోరుతున్నారు. వర్సిటీల్లో అధ్యాపకుల కొరత వల్ల ప్రతిభ గల విద్యార్థులు విదేశీ చదువులకు మొగ్గు చూపే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.