భువనేశ్వర్: ఆ ఇంట్లో పెండ్లి జరుగుతున్నది. డీజే సౌండ్ హోరెత్తుతున్నది. అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వేడుక జరుగుతున్న ఇంటి పక్కనే ఓ కోళ్ల ఫామ్ ఉన్నది. అసలే ఫారమ్ కోళ్లు. డీజే సౌండ్ను తట్టుకోలేకపోయాయి. గిలగిలా కొట్టుకుని 63 కోళ్లు చనిపోయాయి. తన కోళ్ల చావుకు డీజేనే కారణమని వాటి యజమాని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ వింత కేసు ఇప్పుడు ఒడిశాలోని బాలాసోర్ పోలీసుల ముందున్నది.
బాలాసోర్కు చెందిన రంజిత్ అనే యువకుడు కోళ్లఫామ్ నడుపుతున్నాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన అతడు.. ఉద్యోగం లభించకపోవడంతో రూ.2 లక్షలు లోన్ తీసుకుని కోళ్ల ఫామ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిళ్లులు పడేలా డీజే సౌండ్ పెట్టారని, దీంతో కోళ్లు అల్లాడిపోయాయని, అటూ ఇటూ కొట్టుకుని కింద పడిపోయాని రంజిత్ చెప్పాడు. ఆ హోరెత్తించే శబ్దాలను తగ్గించుకోవాలని వేడుకున్నానని, అయినప్పటికీ వారు పట్టించుకోలేదని వెల్లడించాడు. దీంతో 63 కోళ్లు మృత్యువాతపడ్డాయని అతడు వాపోయాడు.
మరుసటి రోజు వెటర్నరీ డాక్టర్కు వాటిని చూపించానని, అవి గుండె పోటుతో కన్నుమూశాయని చెప్పినట్లు వెల్లడించాడు. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేశాడని తెలిపాడు. అయితే తనకు నష్టపరిహారం ఇవ్వాలని పెండ్లి జరిగిన ఇంటి యజమానికి అడిగానని, వారు స్పందించలేదన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రంజిత్ వెల్లడించాడు.