ఛోటాడేపూర్ (గుజరాత్), జనవరి 3: ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఆరుగురు బాలికలు నడుస్తున్న ట్రక్కు లోంచి దూకిన ఘటన గుజరాత్లోని ఛోటాడేపేర్ జిల్లాలో జరిగింది. వారు దూకిన వెంటనే ట్రక్కు అదుపు తప్పి బోల్తాపడింది. నిందితుడు ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సంకేడ తాలుకాలోని గ్రామంలో నివసిస్తున్న ఆరుగురు బాలికలు అక్కడకు ఐదు కిలోమీటర్ల దూరంలోని స్కూల్లో చదువుకుంటున్నారు. మంగళవారం స్కూల్ అయిన తర్వాత యథాప్రకారం పికప్ ట్రక్కులో కూర్చున్నారు. దారిలో డ్రైవర్ సురేష్ సహా అప్పటికే వ్యాన్లో ఉన్న మరికొందరు వారిని వేధించడం ప్రారంభించారు. అప్పటికే నిందితులు బాలికల దగ్గర ఉన్న నగదు, వస్తువులు లాక్కున్నారు. దీంతో తమను తాము రక్షించుకోవడానికి బాలికలు వ్యాన్ నుంచి దూకేశారు.