చండీగఢ్: పంజాబ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మరణించారు. ఇందులో ఐదుగురు కరోనా రోగులని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అమృత్సర్లోని నీల్కాంత్ హాస్పిటల్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత గురించి జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆసుపత్రి ఛైర్మన్ సునీల్ దేవ్గన్ ఆరోపించారు. దీంతో ఆక్సిజన్ లేక ఆరుగురు రోగులు చనిపోయారని చెప్పారు. ఇందులో ఇద్దరు మహిళలని వెల్లడించారు.
ఆరుగురు రోగులు మరణించిన తర్వాత కేవలం ఐదు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారని సునీల్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలుత ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సరఫరాదారులు చెబుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పంజాబ్ మంత్రి ఓపీ సోని తెలిపారు.