డెహ్రాడూన్: రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. (long iron pole on railway tracks) గమనించిన లోకో పైలట్ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐరన్ పోల్ను తొలగించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య ఉన్న రైల్వే మార్గంలో ఈ సంఘటన జరిగినట్లు రైల్వే గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 18న రాత్రి 22.18 గంటలకు ఉత్తరప్రదేశ్లోని బిలాస్పూర్ రోడ్, ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ సిటీ మధ్య రైలు మార్గంలోని 43/10-11 కిలోమీటరు వద్ద పట్టాలపై 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభాన్ని లోకో పైలట్ గుర్తించినట్లు తెలిపింది. రైలు నంబర్ 12091 లోకో పైలట్ వెంటనే రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐరన్ పోల్ను తొలగించినట్లు పేర్కొంది. ఆ రైలును సురక్షితంగా నడిపాడని, రుద్రపూర్ సిటీ స్టేషన్ మాస్టర్కు దీని గురించి రిపోర్ట్ చేశాడని వెల్లడించింది.
కాగా, సెప్టెంబర్ ప్రారంభంలో రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. ఫూలేరా-అహ్మదాబాద్ మార్గంలోని వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో ఈ సంఘటన జరిగింది. శారధ్నా- బంగాడ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై రెండు సిమెంట్ దిమ్మెలను దుండగులు ఉంచారు. ఆ గూడ్స్ రైలు సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది. అయితే ఎలాంటి ప్రమాదం జరుగలేదని వెస్ట్రన్ రైల్వే అధికారి నాడు తెలిపారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూడా ఇలాంటి తరహా సంఘటన జరిగింది. దుండగులు గ్యాస్ సిలిండర్ను రైలు పట్టాలపై ఉంచారు. అయితే రైలు లోకో పైలట్ దీనిని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె కూడా అక్కడ ఉన్నాయి. రైలును పేల్చేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.