విహారయాత్రలో విషాదం నెలకొంది. జలపాతం అందాలను చూసి ఆనందించేందుకు వెళ్లిన వారు జలసమాధి అయ్యారు. వారాంతాన్ని ఎంజాయ్ చేసేందుకు చేపట్టిన యాత్ర ఆ కుటుంబానికి కన్నీళ్లనే మిగిల్చింది. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో జలపాతంలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.
వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్దహా జలపాతం వద్దకు ఆదివారం పిక్నిక్కు వెళ్లారు. జలపాతంలోని ప్లంజ్పూల్లో స్నానం చేస్తూ ఏడుగురు గల్లంతైనట్లు ఆదివారం అధికారులకు సమాచారం అందింది. మొదట ఏడుగురిలో ఇద్దరిని గుర్తించి, దవాఖానకు తరలించారు. వీరిలో ఒకరు దవాఖానలో మరణించారని, మరొకరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.
అనంతరం రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. చీకటి కావడంతో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ఆపేశారు. సోమవారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. తప్పిపోయిన మిగిలిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలను గుర్తించామని కొరియా కలెక్టర్ కుల్దీప్ శర్మ తెలిపారు. మృతులను శ్వేతా సింగ్ (22), శ్రద్ధా సింగ్ (14), అభయ్ సింగ్ (22)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అనంతరం బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. జలపాతంలో స్నానం చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తూ హెచ్చరిక బోర్డును ఉంచినప్పటికీ, పర్యాటకులు నీటిలోకి వెళ్లినట్లు పోలీసు అధికారి తెలిపారు.