ముంబై: అతడు ఆ సంస్థ మాజీ ఉద్యోగి. అందులో డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు. ఇంకేముంది మరో ఐదుగురితో కలిసి ఇన్నాళ్లు పనిచేసిన సంస్థకు కన్నం (Robbery) వేశాడు. రూ.4 కోట్లకుపైగా దోచుకెళ్లాడు. ఆదివారం జరిగిన ఈ భారీ దోపిడీని 30 గంటల్లోనే ముంబై పోలీసులు ఛేదించారు.
హర్షద్ ఠాకూర్ (Harshad Thakur) అనే వ్యక్తి ముంబైలోని కల్బదేవిలో ప్రాంతం (Kalbadevi) ఉన్న అంగాడియా అనే సంస్థలో (Angadia firm) పనిచేశాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే అందులో డబ్బును ఎక్కడ భద్రపరుస్తారో అతడికి తెలియడంతో దానిని కాజెయ్యాలని పథకం పన్నాడు. మరో ఐదుగురితో కలిసి ఆదివారం రాత్రి 16వ అంతస్థులో ఉన్న సంస్థ కార్యాలయానికి చేరుకున్నాడు. తమను గుర్తించకుండా ఉండటానికి మాస్కులు ధరించినవారు.. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడిచేసి వారిని కట్టిపడేశారు. కంపెనీలోకి లాకర్ రూమ్కు వెళ్లి అక్కడ ఉన్న రూ.4.05 కోట్లతో అక్కడి నుంచి గుజరాత్లోని పఠాన్కు పరారయ్యారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఓ ట్యాక్స్లో కంపెనీకి వచ్చిన నిందితులు లోపలికి ప్రవేశించగానే మాస్కులు తీసేశారు. దీంతో ఆ గ్యాంగ్లో ఠాకూర్ కూడా ఉన్నారని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారు గుజరాత్లోని పఠాన్కు పరారయ్యారని గుర్తించి.. అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. దీంతో 30 గంటల్లోనే వారందరిని పట్టుకుని.. డబ్బును రికవరీ చేశారు. అయితే వారు అప్పటికే రూ.2 లక్షలు ఖర్చుచేశారని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు.