హల్దానీ: ఉత్తరాఖండ్లోని హల్దానీలో హైకోర్టు అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింస కొనసాగింది. గురువారం రాత్రి బన్బూల్పుర పోలీస్ స్టేషన్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హింసాకాండలో ఆరుగురు చనిపోగా, వందకు పైగా పోలీసులు గాయపడ్డారు.
అల్లరి మూకలు ప్రణాళిక ప్రకారం ఘర్షణలు సృష్టించాయని శుక్రవారం అధికారులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్లోనూ హై అలర్ట్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. నైనిటాల్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. సోషల్ మీడియా కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ద్వారా నిందితులను గుర్తించామని, వారు ఠాణాలోని పోలీసులను కాల్చేందుకు ప్రయత్నించారని నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ వందనా తెలిపారు.