కోల్కతా: పశ్చిమబెంగాల్లోని (West Bengal) ఉత్తర 24 పరగాణా జిల్లాలో (North 24 Parganas district) ఉన్న ఓ పటాకుల పరిశ్రమలో (Firecracker factory) భారీ పేలుడు (Blast) సంభవించింది. ఆదివారం ఉదయం ఉత్తర 24 పరగణ జిల్లాలో ఉన్న దుట్టపుకుర్ (Duttapukur) ప్రాంతంలోని పటాకుల తయారీ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పేలుడుతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత నాలుగు నెలల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. మే నెలలో మిడ్నాపూర్ (Midnapur) జిల్లాలోని ఓ పటాకుల కంపెనీలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మరణించారు.