షిల్లాంగ్: మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. నాంగ్చ్రామ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోరు. మరో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
సుమారు 21 మంది ప్రయాణికులతో బస్సు తురా నుంచి షిల్లాంగ్కు వెళ్తున్నది. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటల సంమయంలో నాంగ్చ్రామ్ వద్ద అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ బ్రిడ్జి రింగ్దీ నదిపై ఈస్ట్ గారో హిల్స్, వెస్ట్ కాశీ హిల్స్ జిల్లా మధ్య ఉన్నదని, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని, మరో రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
కాగా, ప్రమాద సమయంలో బస్సు చాలా వేగంగా ప్రయాణిస్తున్నదని, అదుపుతప్పి బస్సు ముందు భాగం బ్రిడ్జిని ఢీకొట్టి నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.