బెంగళూరు: ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జలహళ్లిలోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్ (ఏఎఫ్టీసీ)లో 27 ఏళ్ల అంకిత్ కుమార్ ఝా క్యాడెట్గా శిక్షణ పొందుతున్నాడు. అయితే శనివారం అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అంకిత్ను శిక్షణ నుంచి తొలగించడంతోపాటు న్యాయ విచారణకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు క్యాంపస్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్ కమోడోర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న ఐఏఎఫ్ అధికారులు తనను వేధించి ఆత్మహత్యకు పురిగొల్పినట్లు సూసైడ్ లెటర్ రాశాడు.
కాగా, అంకిత్ కుమార్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిక్షణలో వేధింపులు, హింసను అతడు ఎదుర్కొన్నాడని ఆరోపించారు. దీంతో మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అంకిత్ కుమార్ రాసిన సూసైడ్ నోట్పై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.