అవినీతి చేశారంటూ పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను సీఎం భగవంత్ మాన్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో విజయ్ సింగ్లా ఒక పర్సెంట్ కమీషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని, అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని సీఎం మాన్ ప్రకటించారు. ఇంతకీ.. విజయ్ సింగ్లా ఏం చేశారంటే…
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేందర్ సింగ్ను ఓ నెల క్రితం మంత్రి విజయ్ సింగ్లా ఓఎస్టీ ఓ హోటల్కు పిలిపించారు. అక్కడే మంత్రి సింగ్లా కూడా ఉన్నారు. తాను హడావుడిగా వున్నానని, తన తరపున ఓఎస్డీ మాట్లాడతారని మంత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్తో చెప్పారు. ఆయన చెప్పింది వినండి అని చెప్పి మంత్రి వెళ్లిపోయారు. 58 కోట్ల విలువైన పనులు ఇచ్చారని, అందులో 2 శాతం అంటే.. 1.6 కోట్లు మంత్రికి ఇవ్వాలని ఓఎస్డీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్తో తెగేసి చెప్పారు.
ఈ మీటింగ్ తర్వాత మంత్రి తరపున ఓఎస్డీ ఈ నెల 8,10,12,13,23 తేదీల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కి వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. దీంతో ఇలా చేయడం కుదరదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తేల్చి చెప్పారు. మీకు నచ్చని పక్షంలో సొంత విభాగానికి పంపేయాలని, తాను డిప్యూటేషన్పై ఆరోగ్య శాఖకు వచ్చినట్లు వివరించారు.
దీని తర్వాత 10 లక్షల కమీషన్ కోసం మళ్లీ ఓఎస్డీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత 5 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఏఈ రాజేందర్ సింగ్ను ఓఎస్డీ సెక్రెటేరియట్కు పిలిచారు. ఇకపై ఏరకమైన పనులు జరిగినా 1 పర్సెంట్ డబ్బులు పక్కకు తీసి పెట్టాలని ఓఎస్డీ సూచించారు.
ఇక్కడే కథంతా మలుపు తిరిగింది. మే 23న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ మాటలన్నింటినీ రికార్డు చేశారు. పోలీసులకు, ముఖ్యమంత్రి పేషీకి పంపారు. దీంతో సీఎం మాన్ అలర్ట్ అయ్యారు. వెంటనే మంత్రి విజయ్ సింగ్లాను తన నివాసానికి పిలిపించుకున్నారు. కమీషన్ అడగడంపై ఆరా తీశారు. ఇంజినీర్ రికార్డ్ చేసిన విషయం సరైనదేనా? అంటూ సీఎం ప్రశ్నించారు. మంత్రి అంగీకరించడంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఏసీబీ అరెస్ట్ కూడా చేసింది.