భారత వాయుసేన అవసరాల కోసం సీ-295 ఎండబ్ల్యూ రకానికి చెందిన 56 రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా స్పెయిన్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీతో పాటు టాటా కన్సార్షియం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రస్తుతం ఉన్న అవ్రో ఎయిర్క్రాఫ్ట్ స్థానంలో ఈ విమానాలను తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ అభియాన్’ను ప్రోత్సహించడానికే వీటి తయారీని భారత్లో చేపడుతున్నట్టు పేర్కొంది. డీల్లో భాగంగా వచ్చే 48 నెలల్లో స్పెయిన్ కంపెనీ 16 విమానాలను వాయుసేనకు అందించాలి. మిగతా 40 విమానాలను టాటా సంస్థ భారత్లో తయారు చేయాలి. పదేండ్లపాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా భారత్లో మిలిటరీ విమానాల తయారీని చేపట్టడం ఇదే తొలిసారి. సీ-295 ఎండబ్ల్యూ రకానికి చెందిన ఒక్కో విమానం 5-10 టన్నుల బరువును మోయగలదు. క్లిష్ట సమయాల్లో వెనుక నుంచి దూకేందుకు ప్రత్యేక ద్వారం, సైనికులు, అవసరమైన సామగ్రిని దింపేందుకు పారా డ్రాపింగ్ వ్యవస్థ వీటిల్లో అందుబాటులో ఉంటుంది.