Power crisis | ఒకవైపు దేశమంతా వర్షాభావం. పూర్తిస్థాయిలో హైడల్ విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. ఉన్నది థర్మల్ విద్యుత్తు మాత్రమే. కానీ దేశవ్యాప్తంగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ప్రతి విద్యుదుత్పత్తి కేంద్రంలో కనీసం 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. కానీ రామగుండం ఎన్టీపీసీలో ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. పరిస్థితి ‘క్రిటికల్’గా ఉన్నదంటూ ఏకంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తన రోజువారీ స్టాక్ నివేదికలోనే పేర్కొన్నది.
ఇది కేవలం రామగుండంలోనే కాదు, దేశంలోని 52 ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి.
ఒకవైపు దేశమంతా కరెంటు చీకట్లు కమ్ముకుంటున్నాయి. బొగ్గు నిల్వల్లేక విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు మూతపడితే దేశంలో మిగిలేది అంధకారమే. ఇప్పటికే తెలంగాణ మినహా అనేక రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు కొరతతో సతమతమవుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు ఇప్పటికే పవర్హాలిడే ప్రకటించగా.. కరెంటు కోతలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు తీవ్రమవుతున్నాయి. అసోంలో లోడ్షెడ్డింగ్ ప్రకటించారు. తాజాగా మధ్యప్రదేశ్లో విద్యుత్తు కోతలు తీవ్రమయ్యాయి.
మోదీ సర్కారు ముందుచూపు ఏమైంది?
కరెంటు సరఫరామీద బొగ్గు కత్తి వేలాడుతున్న వేళ.. కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. బొగ్గును దిగుమతి చేసుకోవాలని రాష్ర్టాలకు ఉచిత సలహా పడేసి మిన్నకున్నది.
బొగ్గు ఎవరి దగ్గరున్నది? దిగుమతి ఎవరి నుంచి? అదానీ నుంచేనా..?
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో కరెంటు సంక్షోభం తరుముకొస్తున్నది. ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బొగ్గుమసి కమ్మేస్తున్నది. తీవ్ర బొగ్గు కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒకటిరెండు రోజులకే సరిపోతాయని ఏకంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)యే ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి కేంద్రంలో 20 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. కానీ, ప్రభుత్వరంగంలోని 52 కేంద్రాల్లో రెండురోజులకు సరిపడా నిల్వలు కూడా లేవని, ఈ ప్లాంటు క్రిటికల్ కండిషన్లో ఉన్నాయని హెచ్చరించింది. విద్యుత్తు రంగంలో అప్రతిహత ప్రగతి సాధించామని, అనేక సంస్కరణలు చేపట్టామని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఈ బొగ్గు కొరత ఘంటారావాలు వినపడటం లేదు. దేశవ్యాప్తంగా సుమారు 180 ప్రభుత్వరంగ (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) థర్మల్ విద్యుత్తు కేంద్రాలుండగా.. అందులో 52 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటాయని సీఈఏ విడుదల చేసిన రోజువారీ బొగ్గు నిల్వల రిపోర్టులో హెచ్చరించింది. ఈ పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వరంగ విద్యుత్తు కేంద్రాలను నష్టాల్లో ముంచి, ప్రైవేటు రంగానికి కట్టబెట్టడానికే ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని 180 విద్యుత్తు కేంద్రాల మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,05,946 మెగావాట్లు. 52 ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నదని సీఈఏ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ 52 ప్లాంట్లు బొగ్గు నిల్వల విషయంలో ‘క్రిటికల్’ అని కూడా హెచ్చరించింది. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలకు సంబంధించి ప్రతిరోజూ సీఈఏ నివేదిక విడుదల చేస్తుంది. బుధవారం (6.9.2023) నాటి నివేదికలో 52 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. అంటే మొత్తం థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 29 శాతం ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటే ప్రమాదంలో ఉన్నాయి.
బొగ్గు గనులను వేలం వేయడం దగ్గరి నుంచి.. విద్యుత్తు ప్లాంట్లకు ఏ గనుల నుంచి బొగ్గును సరఫరా చేయాలనే అంశం వరకు నిర్ణయాధికారమంతా కేంద్రానిదే. కానీ, బొగ్గు నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచే విషయంలో మాత్రం మోదీ సర్కారు మౌనముద్ర వహిస్తున్నది. ప్రభుత్వరంగంలోని 180 థర్మల్ ప్లాంట్లకు రోజుకు 254.07 లక్షల టన్నుల బొగ్గు అవసరం. విద్యుత్తు ఉత్పత్తిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే.. కనీసం 516.06 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న నిల్వలు 279.20 లక్షల టన్నులు మాత్రమే. అంటే ఉండాల్సిన నిల్వల్లో 54 శాతం మాత్రమే ఉన్నాయన్నమాట. ఇందులో అత్యంత దారుణం (క్రిటికల్) స్థాయిలో ఉన్నవి 52 ప్లాంట్లు అని సీఈఏ నివేదిక కుండబద్ధలు కొట్టింది.
డిమాండ్కు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే పూర్తిస్థాయిలో ఇంధన నిల్వలు (బొగ్గు వగైరా) ఉండాలి. కేంద్రం మాత్రం బొగ్గు నిల్వలను సరిపడా ఉంచటంలో విఫలమవుతూనే ఉన్నది. దీంతో విద్యుత్తు కేంద్రాలను బ్యాక్డౌన్ చేయాల్సిన దుస్థితి తలెత్తుతున్నది. మనదేశంలో బొగ్గు నిల్వలకు కొదువలేదు. దాదాపు 100 సంవత్సరాలకుపైగా సరిపడా నిక్షేపాలు ఈ నేలలో ఉన్నాయి. వాటిని తవ్వి తీయడంపై కేంద్రం దృష్టి సారించడంలేదు. దీనితో బొగ్గు నిల్వలు తద్వారా ఉత్పత్తి తగ్గుతున్నది. ఒక్క తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ర్టాలన్నీ పెద్దు ఎత్తున విద్యుత్తు కోతలు విధిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ముందుచూపుతో 24 గంటలూ విద్యుత్తు వెలుగులే కనపడుతున్నాయి. వ్యవసాయానికి కూడా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు అందిస్తున్నారు.
తెలంగాణ అవసరాలను ముందుగానే ఊహించిన సీఎం కేసీఆర్, విద్యుత్తురంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 7,778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా.. దానిని 2022 మార్చి నాటికి 17,228 మెగావాట్లకు పెంచారు. కానీ దేశవ్యాప్తంగా చూసుకొంటే.. 2014 మార్చిలో 2,48,554 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా.. 2022 మార్చి నాటికి 3,99,497 మెగావాట్లకు మాత్రమే పెంచారు. తెలంగాణలో స్థాపిత సామర్థ్యం రెట్టింపునకు పైగా పెరగ్గా.. దేశవ్యాప్తంగా 60 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. అందుకే ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో చీకట్లు కమ్ముఎకొంటుండగా.. తెలంగాణలో మాత్రం 24 గంటలపాటు వెలుగులు విరజిమ్ముతున్నాయి.