రాంచీ : జార్ఖండ్ షింగ్బూమ్ జిల్లాలోని జంషెడ్పూర్లో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తున్న 500 కిలోల బీఫ్ ( గొడ్డు మాంసం ) ను సీజ్ చేశారు. ఈ మాంసాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జార్ఖండ్లో పశువుల వధను నిషేధించినప్పటికీ, గొడ్డు మాంసం తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో బిస్తూపూర్ పోలీసులు ఆ వాహనంపై నిఘా ఉంచి అడ్డుకున్నారు. ఆ ఇద్దరి నుంచి రూ. 40 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్నీ జంషెడ్పూర్లోని దత్కిదిహ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వీరిద్దిరపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.