జైపూర్, ఫిబ్రవరి 13: సాధారణంగా ‘వాంటెడ్’ లిస్టులో ఉన్న నేరస్థులను పట్టుకుంటే కొన్ని వేలో, లక్షల రూపాయలో రివార్డుగా ఇవ్వడం చూస్తుంటాం. అయితే రాజస్థాన్ పోలీసులు బుధవారం ఒక నిందితుడిని పట్టుకుంటే ప్రకటించిన బహుమతి ఎంతో తెలుసా అక్షరాలా ‘50 పైసలు’. ఇది నిజం. సింఘనా పోలీస్ స్టేషన్లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదై తప్పించుకు తిరుగుతున్న యోగేశ్ మేఘ్వాల్ను పట్టుకుంటే కనీసం వాడుకలో కూడా లేని 50 పైసలు రివార్డుగా ఇస్తామంటూ జుంజును పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర విష్ణోయ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు.
యోగేశ్ను పట్టుకున్నా, అతని గురించి సమాచారం ఇచ్చినా ఈ రివార్డు ఇస్తామని చెప్పారు. ‘ఒక నేరస్థుడి విలువ, హోదా సమాజంలో 50 పైసలు మాత్రమే అని ప్రజలకు ఒక స్పష్టమైన, సానుకూల సందేశం ఇవ్వడానికే ఈ ప్రకటన చేశాం’ అని ఎస్పీ తెలిపారు.