కొచ్చి: కేరళలోని కొచ్చి సమీపంలో జరిగిన కలమస్సెరి పేలుళ్ల(Kalamassery blasts) కేసులో పోలీసులు డామినిక్ మార్టిన్ అనే నిందితుడిని పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పేలుళ్ల కోసం అతను స్థానికంగా తయారు అయ్యే 50 గుండు బాంబులు, 8 లీటర్ల పెట్రోల్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కలమస్సెరిలో జరిగిన జెహోవా విట్నెస్స్ ప్రార్థన మీటింగ్లో ఆ బాంబులతోనే పేలుళ్లు జరిపినట్లు అతను చెప్పాడు.
అయితే ఐఈడీ ద్వారా గుండు బాంబులను పేల్చినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తెలిపాడు. పేలుడు కోసం వాడిన సర్క్యూట్కు సంబంధించిన కొన్ని వస్తువులను ఎన్ఎస్జీ స్వాధీనం చేసుకున్నది. ప్లాస్టిక్ బ్యాగుల్లో పేలుడు పదార్ధాలను పెట్టి, ఆ బ్యాగులను ప్రార్థన జరుగుతున్న హాల్లో ఉంచినట్లు మార్టిన్ వెల్లడించాడు. ఆ వ్యక్తికి చెందిన ఫోన్ నుంచి కొన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ప్రార్థనాస్థలంలో సుమారు ఆరు చోట్ల పేలుడు పదార్ధాలను అమర్చినట్లు అతను తెలిపాడు.
డామినిక్ అత్త కూడా ప్రార్థన సమావేశాలకు హాజరైంది. అయితే ఆ పేలుళ్లలో ఆమెకు ఏమీ కాలేదు. అలువాలో ఉన్న తన పూర్వీకుల ఇంట్లోనే బాంబును తయారు చేసినట్లు చెప్పాడు. ఆదివారం తెల్లవారుజామున ఏడు గంటలకు పేలుడు పదార్ధాలతో ఉన్న బ్యాగులను ప్రార్థనా ప్రాంతంలో పెట్టినట్లు తెలిపాడు. తన నేరాన్ని అంగీకరిస్తూ అతను ఓ వీడియోను తయారు చేసి దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. వీడియోను రికార్డ్ చేయడానికి కొరట్టిలోని ఓ లాడ్జి రూమ్ను కిరాయి తీసుకున్నాడు. 10.45 నిమిషాలకు రూమ్ను తీసుకుని కేవలం 10 నిమిషాల్లో అతను అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
పేలుళ్లలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరుకున్నది. వరుస పేలుళ్ల వల్ల 51 మంది గాయపడ్డారు. జెహోవా విట్నెస్స్ గ్రూపు ఐడియాలజీ దేశానికి ప్రమాదకరంగా ఉందని, ఆ ఐడియాలజీని అంతం చేయాలన్న ఉద్దేశంతో పేలుళ్లకు ప్లాన్ వేసినట్లు చెప్పారు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న మార్టిన్ .. జెహోవా గ్రూపుపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆరేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాడు.
గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.