భువనేశ్వర్: ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో అయిదు బేబీ ఒరాంగుటాన్ల(Odisha Orangutans)ను అటవీశాఖ అధికారులు రెస్క్యూ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇండోనేషియా, మలేషియా అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన జీవులు.. ఒడిశాకు ఎలా వచ్చాయన్న కోణంలో విస్తృత దర్యాప్తు జరుగుతున్నది. ఒడిశా పోలీసు శాఖ ఎస్టీఎఫ్, వన్యప్రాణుల నేర నియంత్రణ సంస్థ కూడా ఒరాంగుటాన్ల వెనుక దాగి ఉన్న మిస్టరీని చేధిస్తున్నాయి. బహుశా అంతర్జాతీయ వైల్డ్లైఫ్ స్మగ్లింగ్ నెట్వర్క్ ఒరాంగుటాన్లను తీసుకువచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఒరాంగుటాన్లను స్వాధీనం చేసుకున్న అటవీ ప్రాంతంలో అనుమానాస్పద రీతిలో ఓ బ్లాక్ కలర్ ఎస్యూవీ తిరిగినట్లు గుర్తించారు. ఆ బ్లాక్ కలర్ కారుకు, ఒరాంగుటాన్లకు ఏదో లింకు ఉండి ఉంటుందని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.
భోగ్రాయి బ్లాక్లో ఉన్న బిచిత్రాపూర్ అటవీ ప్రాంతం నుంచి అయిదు ఒరాంగుటాన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన వాటిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి బడాపాయి గ్రామం వద్ద తిరిగిన ఎస్యూవీ గురించి ఆరా తీస్తున్నారు. భోగ్రాయితో పాటు బెంగాల్లోని దిఘా వద్ద ఏర్పాటు చేసిన సుమారు 55 సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు టాస్క్ఫోర్స్ పేర్కొన్నది. అయితే ఆ ఎస్యూవీకి చెందిన పైభాగం మాత్రమే సీసీటీవీల్లో కనిపించిందని, రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియడం లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేశ్ రామ్ సింగ్ కుంతియా తెలిపారు. అనుమానాస్పగా తిరిగిన ఆ కారు ఈ కేసులో కీలకమైందన్నారు.
ఒరాంగుటాన్లను గుర్తించిన ప్రాంతం సమీపంలో ఓ నల్ల రంగు పాలిథీన్ బ్యాగులో ఫేస్ మాస్క్లను కూడా రికవరీ చేశారు. ఒరాంగుటాన్లను వదిలేసిన వారే ఆ మాస్క్లను వాడి ఉంటారని భావిస్తున్నారు. బెంగాల్లోని దిఘా-చందనేశ్వర్, భోగ్రాయి మార్గాల ద్వారా బాలసోర్లోకి ఆ జంతువులను తీసుకువచ్చి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. వన్యప్రాణుల స్మగ్లింగ్కు పాల్పడుతున్న వారు కావాలని హైవేలను వదిలేసి, గ్రామీణ రోడ్ల ద్వారా ఒరాంగుటాన్లను స్మగ్లింగ్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఒరాంగుటాన్లు భారతీయ వాతావరణానికి తగిన జంతువులు కాదు అని, ఇండియా వాటి సహజ స్థలం కాదు అని, వాటికి ఇక్కడ బ్రీడింగ్ చేయలేమని అధికారులు చెప్పారు. బహుశా మయన్మార్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆ జంతువులను స్మగ్లింగ్ చేసి, అక్కడ నుంచి ఒడిశాకు వచ్చేలా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇండోనేషియా నుంచి ఒరాంగుటాన్లను తెచ్చి ఉంటే, అప్పుడు అంతర్జాతీయ స్మగ్లింగ్ బృందం హస్తం దీంట్లో ఉంటుందని చెబుతున్నారు. బెంగాల్లో కానీ, ఒడిశాలో కానీ .. ఆ స్మగ్లర్లకు ఏజెంట్లు ఉండి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో ఒరాంగుటాన్ సుమారు 25 లక్షల వరకు ఉంటుంది. సముద్ర మార్గంలో షిపులు, ఫిషింగ్ ట్రాలర్స్ ద్వారా ఆ జంతువులను స్మగ్లింగ్ చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు.