చెన్నై: వివాహ వేడుక కోసం వచ్చిన వైద్య విద్యార్థులు సముద్ర తీరంలోని బీచ్లో ఈతకు దిగారు. వీరిలో ఐదుగురు సముద్రంలో మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాపాడిన మరో ముగ్గురు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (Medical Students Drown In Sea) తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ సంఘటన జరిగింది. తిరుచిరాపల్లిలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఆదివారం ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆ స్టూడెంట్స్ పలు బృందాలుగా విడిపోయారు.
కాగా, ఒక మెడికో బృందం కన్యాకుమారి తీరంలో మూసి ఉన్న ప్రైవేట్ బీచ్లో ఈత కోసం సముద్రంలోకి దిగింది. అయితే అలలకు కొందరు విద్యార్థులు కొట్టుకుపోయారు. దీంతో సముద్రంలో మునిగి ఐదుగురు మరణించారు. మృతులను తంజావూరుకు చెందిన చారుకవి, నైవేలికి చెందిన గాయత్రి, కన్యాకుమారికి చెందిన సర్వదర్శిత్, దిండిగల్కు చెందిన ప్రవీణ్ సామ్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటేష్గా గుర్తించారు.
మరోవైపు మరో ముగ్గురు మహిళా మెడికోలైన కరూర్కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి ప్రియాంక, మదురైకి చెందిన శరణ్యను రక్షించారు. ఆసారిపల్లం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరణించిన మెడికో స్టూడెంట్స్ కోర్సు మరి కొన్ని వారాల్లో ముగియనున్నదని చెప్పారు.