భువనేశ్వర్: ఒడిశాలోని (Odisha) కియోంఝర్ (Keonjhar)లో లారీ బీభత్సం సృష్టించింది. మంళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 20వ నంబర్ జాతీయ రహదారిపై కియోంఝర్ పట్టణంలోని సతీఘర్ సాహీ (Sathighar Sahi) వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పి ఊరేగింపుగా వెళ్తున్న పెండ్లి బృందంపైకి (Wedding procession) దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 1 నుంచి 1.30 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నదని తెలిపారు. పెండ్లి కొడుకును ఊరేగింపుగా వధువు ఇంటికి తీసుకెళ్తున్నారని, మరికొద్ది దూరంలోనే వారంతా పెండ్లి కూతురు ఇంటికి చేరుకునేవారని, ఇంతలోనే ఘోరం చోటుచేసుకుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.