తిరువనంతపురం: ఐదు రోజుల శిశువుకు ఒక టీకా బదులు ఒకేసారి ఐదు టీకాలు ఇచ్చారు. ఆ శిశువుకు తీవ్ర జ్వరం రావడంతో ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సును సస్పెండ్ చేశారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం నాదిర్షా, సిబినా దంపతులు ఐదు రోజుల బిడ్డను పిరాయిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బీసీజీ టీకా కోసం వచ్చినట్లు డాక్టర్కు చెప్పారు. డాక్టర్ రాసి ఇచ్చిన చీటీని నర్సు చారులతకు ఇచ్చారు. తమ బిడ్డకు బీసీజీ టీకా వేయాలని కోరారు.
కాగా, ఆ నర్సు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. శిశువు కుడి చేతికి బీసీజీ టీకా ఇంజెక్ట్ చేసింది. మరో రెండు టీకాలను తొడలకు ఇంజెక్షన్ ఇచ్చింది. అలాగే మరో రెండు వ్యాక్సిన్స్ను శిశువు నోటిలో వేసింది. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే ఈ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ శిశువును వైద్య పరిశీలనలో ఉంచారు. కొంత సమయం తర్వాత తీవ్ర జ్వరం రావడంతో పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువుకు ఒకేసారి ఐదు టీకాలు వేసిన నర్సు చారులతను సస్పెండ్ చేశారు.