బాటా దురియన్, ఏప్రిల్ 20: ఉగ్రవాదుల ఏరివేతకు బయల్దేరిన భారత సైనికులు.. టెర్రరిస్టుల దుశ్చర్యకే బలయ్యారు. ఆర్మీ ట్రక్పై టెర్రరిస్టులు గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమయ్యారు. జమ్ముకశ్మీర్లోని బాటా దురియన్లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టి నెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్ మీడియాకు తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరడంతో ట్రక్లో ఉన్న ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ సైనికులు వీర మరణం పొందారని, ఈ ఘటనలో గాయపడిన ఒక సైనికుడిని రాజౌరీలోని ఆర్మీ దవాఖానకు తరలించామని చెప్పారు.
పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. భారీ వర్షాలు, వెలుతురు సరిగా లేని వాతావరణాన్ని అవకాశంగా మలుచుకొన్న ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దుశ్చర్యకు కారణమైన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) ప్రకటించిందని భారత సైన్యం తెలిపింది. భింభెర్ గాలి-పూంచ్ మార్గంలో ట్రాఫిక్ను ఆపేశారు. 2021 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. తాజా ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు సమాచారం. దీని ప్రభావం జీ-20 సదస్సుపైనా పడే అవకాశం ఉన్నది.