Maharashtra | ఔరంగాబాద్, జూలై 24: మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతుల పరిస్థితి మారడం లేదు. రాష్ట్ర రైతాంగం దయనీయ దుస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వం నుంచి అండ లేక, అప్పుల భారం తట్టుకోలేక, పంట దెబ్బతినడం వంటి కారణలతో వేలాదిగా అన్నదాతలు ఉసురు తీసుకొంటున్నారు. దిక్కుతోచని పరిస్థితులతో ఏండ్లుగా రైతుల బలవంతపు మరణాలు జరుగుతూనే ఉన్నాయి. మరాఠ్వాడా రీజియన్లో అయితే పరిస్థితి మరీ దారుణం.
ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మధ్య ఆరు నెలల కాలంలో మరాఠ్వాడాలో 483 మంది ఆత్యహత్య చేసుకొన్నట్టు రెవెన్యూ శాఖ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వీరిలో ఒక్క జూన్లో 92 మంది రైతులు ప్రాణాలు తీసుకొన్నట్టు అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. జనవరి, జూన్ మధ్య ప్రతి నెలా రైతుల ఆత్యహత్యల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. జూన్లో చోటుచేసుకొన్న 92 ఆత్మహత్యల్లో ఒక్క బీడ్ జిల్లాలోనే 30 జరిగాయి. తర్వాతి స్థానంలో నాందేడ్లో 24 మంది రైతులు ఉసురు తీసుకొన్నారు.
బాధిత కుటుంబాలపై నిర్లక్ష్యం
బతికున్నప్పుడు రైతులను పట్టించుకోని మహారాష్ట్ర ప్రభుత్వం.. చనిపోయిన తర్వాత వారి కుటుంబాలను ఆదుకోవడంలోనూ నిర్ల క్ష్యం చూపుతున్నది. 483 మంది రైతుల మరణాల్లో, 67 కేసులను ఎక్స్గ్రేషియోకు అర్హత లేదని తేల్చారు. మిగతా వాటిల్లో కూడా ఇప్పటివరకు 10 కుటుంబాలకే ఎక్స్గ్రేషియో ఇచ్చిం ది. ఎక్స్గ్రేషియో కింద రూ.30 వేల నగదు ఇచ్చిన షిండే-బీజేపీ ప్రభుత్వం.. భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకొనేందుకు రూ.70 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని అధికారి పేర్కొన్నారు.