జైపూర్: బ్లాక్ ఫంగస్ (మ్యూకార్ మైకోసిస్)కు కరోనా వైరస్తో, డయాబెటిస్తో చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే కరోనా వచ్చి తగ్గిపోయిన డయాబెటిక్ పేషెంట్లకే బ్లాక్ ఫంగస్ సోకింది. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తి డయాబెటిక్ పేషెంట్ అయితే, ఆ వ్యక్తిలో షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. దాంతో వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయి బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతుంది. అంటే కరోనా వైరస్ సోకకుండా బ్లాక్ ఫంగ్స్ బారినపడటం అత్యంత అరుదు అని స్పష్టమవుతున్నది.
కానీ, కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా, సెకండ్ వేవ్ తర్వాత మొత్తం మూడు నెలల వ్యవధిలో జైపూర్లో 3,471 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. అందులో 477 మందికి అసలు కరోనా వైరసే సోకలేదని వెల్లడైంది. అంటే మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 14 శాతం కేసులకు కొవిడ్ హిస్టరీ లేదన్నమాట. దాంతో వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది అనే విషయంలో సమగ్ర అధ్యయనం జరుగాల్సి అవసరం ఉన్నదని వారు చెబుతున్నారు.
సాధారణంగా క్యాన్సర్, అదుపుతప్పిన డయాబెటిస్, హెచ్ఐవీ లాంటివి ఉన్నావాళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయని, కరోనా కారణంగా చాలామందిలో షుగర్ లెవల్స్ అదుపుతప్పాయని, అందుకే కొవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ విజృంభించిందని జైపూర్లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుధీర్ భండారీ తెలిపారు. అయితే, కొవిడ్ ట్రీట్మెంట్ కోసం స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించడం డయాబెటిక్ రోగుల్లో షుగర్ లెవల్స్ అదుపు తప్పడానికి దారితీస్తుందని, దాంతో బ్లాక్ ఫంగస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
మరీ ఆ 477 మందిలో కొవిడ్ హిస్టరీ లేకపోయినా బ్లాక్ ఫంగస్ ఎందుకు సోకినట్టు అనేదే ఇప్పుడు వైద్యులకు ఫజిల్గా మారింది. ఈ విషయానికి సంబంధించి తాను గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన సహోద్యోగులతో మాట్లాడినా ఒక కంక్లూజన్కు రాలేకపోయామని డాక్టర్ సుధీర్ చెప్పారు. అయితే, కొవిడ్ హిస్టరీ లేకపోయినా బ్లాక్ ఫంగస్ బారిన పడిన ఆ 447 మందికి కూడా లక్షణాలు ఏవీ లేకుండా కరోనా వైరస్ సోకి తగ్గి ఉంటుందని, అందుకే వారికి కరోనా సోకిని విషయాన్ని వారే గుర్తించి ఉండరని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే, జైపూర్తో మొత్తం 3,471 మందికి బ్లాక్ ఫంగస్ సోకగా, వారిలో 2,582 మంది ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరో 563 మంది ఫంగస్ బారినుంచి కోలుకున్నారు. ఇంకో 178 మంది మరణించారు. లెక్కలోకి రాని మరో 148 మంది ఎలాంటి మెడికల్ అడ్వైజ్ లేకుండానే ఆస్పత్రులను విడిచి వెళ్లిపోయారు.