న్యూఢిల్లీ/హుబ్లీ, ఏప్రిల్ 17: కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది పట్టణంలోని పోలీసుస్టేషన్పై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 45 మందిని అరెస్టు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. సోషల్ మీడియాలో ఒక పోస్టుపై వివాదమే దీనికి కేంద్రంగా ఉన్నది. సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే పోలీసులు తీసుకున్న చర్యలపై సంతృప్తి చెందని కొంతమంది శనివారం అర్ధరాత్రి సమయంలో స్టేషన్ను చుట్టుముట్టి భారీయెత్తున రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. మరోవైపు శ్రీరామనవమి నాడు మధ్యప్రదేశ్లో జరిగిన అల్లర్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోలేదని నిరసిస్తూ ర్యాలీలు చేపట్టిన 200 మందిపై కేసులు నమోదు చేశామని, వీళ్లు నిషేదాజ్ఞలు అతిక్రమించారని అధికారులు తెలిపారు.