న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 50 వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 44 వేలకు తగ్గాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మూడో వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి 50 వేల లోపు కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. రోజువారీ కేసులు తగ్గుతుండటంతో పాజిటివిటీ రేటుకు కూడా తక్కువగానే ఉంటున్నది.
దేశంలో కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 684 మంది బాధితులు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,26,31,421కి చేరగా, మరణాలు 5,08,665గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 4,15,85,711 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,37,045 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతానికి తగ్గిందని, రికవరీ రేటు 97.55 శాతానికి చేరిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 172.81 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.