బెంగళూర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భారీగా గోల్మాల్ జరుగుతున్నది. దాదాపు రూ.442 కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. 2,94,281 మంది అనర్హులు, మృతిచెందిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నది. ఇదంతా తెలిసినా రాష్ట్ర యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కిసాన్ సమ్మాన్ పథకానికి అనర్హులైన ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 92 వేల మంది, 2 లక్షల మంది భూస్వాములు, 3,312 మంది మృతులు ఉన్నట్టు తేలింది. స్థానిక వ్యవసాయ అధికారులకు ఈ విషయం తెలిసినా ప్రలోభాలకు లొంగి మౌనం వహిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తంగా 9 లక్షల మంది ఏటా ఈ నిధి నుంచి సాయం పొందుతున్నారు.
మోదీ ఇండ్లకు మోక్షం లేదా?
దేశంలోని పేదలకు 2022 కల్లా గూడు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’కు నిధులు నిలిపివేయడంతో ఎంతో మంది పేదలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కర్ణాటకలో 5,17,531 కుటుంబాలకు ఇండ్లు కట్టివ్వాలని తీర్మానించగా.. ఇప్పటికీ 88,395 (17 శాతం) ఇండ్లే నిర్మించారని కాగ్ తాజా నివేదిక తేల్చింది. గృహ నిర్మాణ శాఖ దశల వారీగా చేసిన సర్వేల ప్రకారం గత ఏడాది మార్చి నాటికి నగరాలు, పట్టణాల్లో ఇండ్లు లేని పేద కుటుంబాలు 13,71,592 ఉన్నాయి. ఈ సర్వే కూడా సమగ్రంగా లేదని కాగ్ తప్పుబట్టింది. సర్వే సరిగా చేయకపోవటం వల్ల కేంద్రం నిధులు నిలిపివేసిందని, ఈ నిధులు రూ.1,003 కోట్లు అని రాష్ట్ర సర్కారుపై మండిపడింది.
వైద్యారోగ్యం గాలికి..
కర్ణాటకలో వైద్యారోగ్యం ఎంత దారుణంగా ఉన్నదో తెలిపే ఘటన ఇది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 169 డయాలసిస్ సెంటర్లు ఉండగా, ఏవీ సరిగా పనిచేయడం లేదు. అయినా, వీటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొన్న పాపానపోలేదు. డయాలసిస్ కోసం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులు..యూనిట్లు పనిచేయడం లేదని తెలిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెడికల్ రిజర్వ్ ఓస్మాసిస్ ప్లాంట్లలోనూ టీడీఎస్ స్థాయులు పరిమితిని దాటిపోవటంతో వాటర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు పనికిరావడం లేదు. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కర్ణాటక సర్కారు తగిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.